18, అక్టోబర్ 2014, శనివారం

గుప్పెడు మంది గుత్తాధిపత్యం

                   దేశం వృద్ధి రేటు ఉరకలెత్తుతున్నప్పుడే కాదు, పతనమైనప్పుడు కూడా అపర కుబేరుల వద్ద సంపద పోగుపడుతూనే ఉంది. ఒక వైపు రోజుకు రూ.20 కూడా ఆదాయం లేని అభాగ్యులు 77 శాతం మంది ఉంటే ఇంకోవైపు గుప్పెడు మంది కుబేరులు జిడిపిలో 50 శాతం సంపదను గుప్పెట్టో పెట్టుకుని కులుకుతున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా మెక్సికోకు చెందిన కార్ల్‌ నస్లిమ్‌ ఫోర్బ్స్‌ జాబితాకెక్కితే, ముంబయిలో నాలుగు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో 27 అంతస్తుల ఆకాశ హర్మ్యాలతో ప్రపంచంలోనే అతి పెద్ద భవంతి
కలిగినవాడిగా ముఖేష్‌ అంబానీ రికార్డుకెక్కారు. ఆ పక్కనే జానెడు జాగా దొరక్క ఫుట్‌పాత్‌లపై బతుకీడుస్తున్న బడుగుజీవులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ఈ అసమానతలు, వైరుధ్యాలకు బుధవారం విడుదలైన ఆక్స్‌ఫామ్‌ నివేదిక అద్దంపట్టింది. ప్రపంచంలోని 85 మంది అపర కుబేరుల వద్ద వంద లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు పోగుపడ్డాయని ఆ నివేదిక తేల్చిచెప్పింది. అదే సమయంలో నిరుపేదల సంఖ్య 350 కోట్లు దాటిన కఠోర సత్యాన్ని బయటపెట్టింది. భారత్‌లోను, ప్రపంచంలోను అభివృద్ధికి నయాఉదారవాద విధానాలే మార్గం అని ఊదరగొడుతున్న తరుణంలో ఆక్స్‌ఫామ్‌ వెల్లడించిన గణాంకాలు ఈ విధానాల డొల్లతనాన్ని బయటపెట్టాయి. భారత్‌లో 10.9 శాతం మందిగా ఉన్న ధనికులు జిడిపిలో 48 శాతం వాటా కలిగివుంటే, అమెరికాలో 10.5 శాతం మంది 42.9 శాతం వాటా కలిగివున్నారు. బ్రిటన్‌, జర్మనీల్లోనూ పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. సోషలిస్టు, ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల పంథాను అనుసరిస్తున్న లాటిన్‌ అమెరికా దేశాలు మాత్రమే ఇందుకు మినహాయింపు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఐరాస-ఎస్కేప్‌ నివేదిక కూడా ఈ అసమానతల పెరుగుదల తీవ్రతను కళ్లకుకట్టినట్లు తెలియజేసింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం కొనసాగిన కాలంలో సైతం కార్పొరేట్‌ , బహుళజాతి సంస్థలు, బడా వ్యాపారులు కోట్లకు పడగలెత్తారంటే ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రస్తుత విధానాలు ఎంత లోపభూయిష్టమైనవో అర్థమవుతుంది. పరమ దుర్మార్గమైన ఈ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో వాల్‌స్ట్రీట్‌ ముట్టడి ఉవ్వెత్తున సాగింది. ఒక శాతం మంది ప్రయోజనాల కోసం 99 శాతం మంది ప్రయోజనాలను తాకట్టు పెడతారా అంటూ అమెరికన్లు నిలదీస్తే దానికి ఒబామా ప్రభు త్వం దగ్గర సమాధానం లేదు. ఇంత జరిగిన తరువాత కూడా పాలకవర్గాలు, కార్పొరేట్‌ ప్రచార బాకాలు అదే ప్రచారాన్ని మరింత దృఢంగా ముందుకుతెస్తున్నాయి.
దేశంలో సంపద పెరిగితే పేదరికం ఆటోమేటిక్‌గా మటు మాయమవుతుందని నయాఉదారవాద ఆర్థిక విధాన సిద్ధాంతవేత్తలు చెప్పేది ఎంత బూటకమో ఆక్స్‌ఫామ్‌ నివేదిక తేటతెల్లం చేసింది. ఈ రెండున్నర దశాబ్దాల ఆర్థిక సంస్కరణల అనుభవమూ దీనినే తెలియజేస్తోంది. ఎనిమిది శాతం వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందను కున్నప్పుడు సైతం ఐరాస మానవాభివృద్ధి నివేదికలో భారత్‌ 126వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆకలి సూచీలో 199వ స్థానానికి దిగజారింది. వ్యక్తిగత మరుగు దొడ్లు లేక మహిళలు బహిర్భూమికి వెళ్లే పరిస్థితి ప్రపంచంలో పది దేశాల్లో ఉంటే, అందులో భారత్‌ ఒకటిగా నిలిచింది. దేశానికి ఇంతకన్నా అవమానమేముంటుంది ? జిడిపి వృద్ధి రేటు ఎంత పెరిగినా మానవాభివృద్ధిలో మార్పు లేనప్పుడు ఆ అభివృద్ధికి అర్థమేముంటుంది ? పెరుగుతున్న అసమానతలను తొలగించాలంటే న్యాయంగా సంపద పంపిణీ జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సంపద సృష్టించేది 99 శాతం మంది, ఆ సంపదను అనుభవించేది ఒక శాతం మంది. ఈ దురన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ అది తన బాధ్యత అని ప్రభుత్వం అనుకోవడం లేదు. కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్‌ ఎవరు అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి. మానవాభివృద్ధిని మెరుగుపరచడం కన్నా కార్పొరేట్‌ స్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. యుపిఎ ప్రభుత్వం గత అయిదేళ్లలో రూ.21 లక్షల కోట్ల మేర కార్పొరేట్లకు పన్నుల్లో రాయితీలిస్తే, మోడీ ప్రభుత్వం ఆ రాయితీల జోరును మరింత పెంచింది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులను కాలరాయడానికి కూడా వెనకాడడం లేదు. సంపన్నులకు వర్తించే పన్ను రేట్లను పెంచడానికి బదులు సామాన్యుడిపై ఎడాపెడా భారాలు వేస్తోంది. బడ్జెట్‌లో పన్నులు-జిడిపి నిష్పత్తిని కుదించింది. ఇవే కాకుండా భూమి, గనులు, గ్యాస్‌ వంటి సహజ వనరుల లూటీకి ప్రభుత్వమే అవకాశం కల్పిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని ఒకవైపు వదులుకుంటూ ఇంకోవైపు ద్రవ్యలోటును సాకుగా చూపి పేదలకిచ్చే సబ్సిడీలపై కోత పెడుతోంది. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశుధ్యం వంటి వాటిని నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలే అసమానతల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి. ప్రపంచంలో ముడి చమురు ధర గత నాలుగేళ్లలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినా ఇక్కడ డీజిల్‌ ధరను తగ్గించడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇవన్నీ ప్రైవేట్‌ చమురు కంపెనీలు లాభాలు పోగేసుకోవడానికి ఉపయోగపడేవే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్థిక అసమానతలను తొలగించడం పెద్ద కష్టమేమీ కాదు. సంపన్నులు, కార్పొరేట్‌ సంస్థలకు వచ్చే గాలివాట లాభాలపైన పన్నులు పెంచడం, విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వెలికి తీయడం వంటి చర్యలు చేపట్టవచ్చు. కానీ, ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదు. ఆక్స్‌ఫామ్‌ నివేదిక చూశాక అయినా ప్రభుత్వ ధోరణిలో మార్పు రావాలి. లేకుంటే లాటిన్‌ అమెరికాలో మాదిరిగా ప్రజలే తిరగబడి వాటిని మార్చుకుంటారు. తస్మాత్‌ జాగ్రత్త !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి