13, అక్టోబర్ 2014, సోమవారం

దళిత - బహుజన పత్రికపై దాడి


                   న్యూఢిల్లీ : దళిత, ఒబిసి, గిరిజనుల గొంతుకగా పేర్కొంటున్న మాసపత్రిక 'ఫార్వర్డ్‌ ప్రెస్‌' కార్యాలయంపై ఢిల్లీ పోలీసులు దాడిచేసి అక్టోబర్‌ సంచిక ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసి, కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు. 'బహుజన - శ్రామిక సంప్రదాయాలు' అంశంపై తెచ్చిన ఈ ప్రత్యేక సంచిక హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని జవహర్‌లాల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు ఎబివిపి కార్యకర్తలు ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగం పత్రిక కార్యాలయంపై దాడి జరిపారు. అలాగే ఢిల్లీలో అనేక
న్యూస్‌స్టాండ్‌ల నుండి అక్టోబర్‌ సంచిక ప్రతులను స్వాధీన పర్చుకున్నారు. కోర్టు నుండి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఒక ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు జరిపిన ఈ దాడి పత్రికా స్వేచ్ఛపై వాక్‌ స్వాతంత్య్రంపై దాడిగా ఫార్వర్డ్‌ ప్రెస్‌ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నది. 'బిజెపిలోని బ్రాహ్మణవాద శక్తుల ఆదేశాల మేరకే పోలీసులు ఈ దాడి జరిపారు. గతంలో కూడా మేము ఈ మశక్తుల దాడులను ఎదుర్కొన్నాము. ఈ దాడులుమా నైతిక స్థైర్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి' అని ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, ఇతర ప్రజా సంఘాలు, రచయిత సంఘాలు ఢిల్లీ పోలీసులు జరిపిన దాడిన తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్ర హక్కును కాలరాస్తోందని జన్‌వాది లేఖక్‌ సంఫ్‌ు పేర్కొన్నది. మహిషాసుర బలిదానం ఉత్సవాన్ని దళిత, బహుజన తరగతులకు చెందిన విద్యార్థులు అక్టోబర్‌ 9న జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని ఎబివిపి విద్యార్థులు భౌతిక దాడుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఈ పత్రిక ప్రతులను పంచడాన్ని వారు వ్యతిరేకించారు. 2011 సంవత్సరంలో కూడా ఇలాగే మహిషాసుర అమరత్వ దినోత్సవాన్ని ఎబివిపి వారు అడ్డుకున్నారు. అయితే ఈ సారి ప్రభుత్వ అండతో నేరుగా పత్రిక కార్యాలయంపై దాడి జరిపించారు. దుర్గామాతను కించపరిచే విధంగా బొమ్మలు, ఫోటోలు ఉన్నాయంటూ వీరు ఆరోపించారు. కేంద్ర హోంమంత్రిత్వ శౄఖ నుండి ఆదేశాలు వచ్చాకే ఢిల్లీ పోలీసు ఎసిపి రంగంలోకి దిగి పత్రికపై దాడులు జరిపారని తెలుస్తోంది. పత్రిక ఎడిటర్‌ ఇవాన్‌కోత్స్‌కా, కన్సెల్టింగ్‌ ఎడిటర్‌ ప్రమోద్‌ రాజన్‌లు పోలీసుల నుండి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు. కోర్టు, ఇతర అథారిటీల నుండి ఉత్తర్వులు లేకుండానే దేశరాజధానిలో ఇలా పత్రికపై దాడి జరగడం హిందుత్వ శక్తులు మరింత పెట్రేగిపోయే అవకాశం ఉందని ఓ సీనియర్‌ సంపాదకుడు పేర్కొన్నారు. రొమిలా థాపర్‌ పుస్తకాలను కాల్చివేయండంటూ సుబ్రమణ్యస్వామి ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి